1 ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. 2 ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, 3 కలియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. 4 ఆయనలో జీవముండెను; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. 5 ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. 6 దేవునియొద్దనుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను. 7 అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. 8 అతడు ఆ వెలుగైయుండలేదు గాని ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. 9 నిజమైన వెలుగు ఉండెను; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. 10 ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికోనలేదు. 11 ఆయన తన స్వకీయులయొద్దకు వచ్చెను; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. 12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. 13 వారు దేవుని వలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛలవలనైనను మానుష్యేచ్ఛలవలనైనను పుట్టినవారు కారు. 14 ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వితీయకుమారునిమహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. 15 యెహాను ఆయననుగుర్చి సాక్ష్యమిచ్చుచు- నా వెనుక వచ్చువాడు నాకంటే ప్రముఖుడు గనుక ఆయన నాకంటె ముందటివాడాయెననియు, నేను చెప్పిన వాడు ఈయనే అనియు ఎలుగెత్తి చెప్పెను. 16 ఆయన పరిపూర్ణతలోనుండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. 17 ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను; కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. 18 ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయకుమారుడేఆయనను బయలుపరచెను. 19 -నీవెవడవని అడుగుటకు యూదులు యెరుషలేమునుండి యాజకులను లేవీయులను యోహానునొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యమిదే. 20 అతడు ఎరగననక ఒప్పుకొనెను; - క్రీస్తునుకానని యొప్పుకొనెను. 21 కాగా వారు - మరి నీవెవడవు, నీవు ఏలీయావా అని అడుగగా - కాననెను. 22 - నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా - కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు - నీవెవడవు?మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్నుగూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతని నడిగిరి. 23 అందుకతడు ప్రవక్తయైన యెషయాచెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. 24 పంపబడినవారు పరిసయ్యులవారు. 25 వారు - నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్తవైనను కాకుండినయెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని అతనిని అడుగగా 26-27. యోహాను - నేను నీళ్లలోబాప్తిస్మమిచ్చుచున్నాను గాని నావెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు;మీరాయన నెరుగరు, ఆయన చెప్పులవారును విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పెను. 28 యోహాను బాప్తిస్మమిచ్చుచున్న యొర్దానునదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. 29 మరునాడు యోహాను యేసు తనయొద్దకు రాగాచూచి - ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొర్రెపిల్ల. 30 నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటి వాడాయెనని నేనెవనిగూర్చి చెప్పితినో ఆయనే యీయన. 31 నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలోబాప్తిస్మమిచ్చుచు వచ్చితినని చెప్పెను. 32 మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు - ఆత్మ పావురమువలె ఆకాశమునుండి దిగివచ్చుట చూచితిని; ఆ ఆత్మ ఆయనమీద నిలిచెను. 33 నేను ఆయనను ఎరుగనైతిని గాని నీళ్లలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు - నీవెవనిమీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలోబాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పెను. 34 ఈయనే దేవుని కుమారుడని నేను తెలిసికొని సాక్ష్యమిచ్చితిననెను. 35 మరునాడు మరల యోహానును అతని శిష్యులలో ఇద్దరును నిలుచుండగా 36 అతడు నడుచుచున్న యేసువైపు చూచి - ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పెను. 37 అతడు చెప్పిన మాట ఆ యిద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. 38 యేసు వెనుకకు తిరిగి వారు తన్నువెంబడించుట చూచి - మీరేమి వెదకుచున్నారని వారినడుగగా వారు - రబ్బీ, నీవు ఎక్కడ కాపురమున్నావని ఆయనను అడిగిరి. రబ్బియను మాటకు బోధకుడని అర్ధము. 39 - వచ్చి చూడుడని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి, ఆయన కావురమున్నస్ధలము చూచి ఆ దినమున ఆయనయొద్ద బసచేసిరి. అప్పుడు పగలు రమారమి నాలుగు గంటల వేళఆయెను. 40 యోహాను మాట విని ఆయనను వెంబడించిన. యిద్దరిలో ఒకడు సీమోను పేతురుయొక్క సహోదరుడైన అంద్రెయ. 41 ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి - మేము మెస్సీయను కనుగొంటిమని అతనితో చెప్పి 42 యేసునొద్దకు అతని తోడుకొనివచ్చెను. మెస్సీయ అను మాటకు అభిషిక్తుడనిఅర్థము. యేసు అతనివైపు చూచి - నీవు యోహాను కుమారుడవైన సీమోనువు; నీవు కేఫా అనబడుదువని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్ధము. 43 మరునాడు ఆయన గలిలైయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని - నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను. 44 ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ పేతురు అను వారి పట్టణపు కాపురస్థుడు. 45 ఫిలిప్పు నతనయేలును కనుగొని - ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలును ఎవనిగూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని; ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసుఅని అతనితో చెప్పెను. 46 అందుకు నతనయేలు - నజరేతులోనుండి మంచిదేదైన రాగలదా అని అతని నడుగా - వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. 47 యేసు నతనయేలు తనయొద్దకు వచ్చుట చూచి - ఇదిగో యితడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనియందు ఏ కపటమును లేదని అతనిగూర్చి చెప్పెను. 48 - నన్ను నీవు ఏలాగు ఎరుగుదువని నతనయేలు ఆయనను అడుగగా యేసు - ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే, నీవు ఆ అంజూరపు చెట్టుక్రింద ఉన్నప్పుడు నిన్ను చూచితినని అతనితో చెప్పెను. 49 నతనయేలు - బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజవు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. 50 అందుకు యేసు - ఆ అంజూరపు చెట్టుక్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటె గొప్పకార్యములు చూతువని అతనితో చెప్పెను. 51 ķరియు ఆయన - మీరు ఆకాశము తెరుబడుటయు, దేవుని దూతలు మనుష్యకుమారునిపైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. Download Audio File
1 మూడవ దినమున గలిలైయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. 2 యేసు తల్లి అక్కడ ఉండెను; యేసును ఆయన శిష్యులును ఆ వివాహమునకు పిలువబడిరి. 3 ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి - వారికి ద్రాక్షారసము లేదని అయనతో చెప్పగా 4 యేసు ఆమెతో - అమ్మా, నీతో నాకేమి (పని)? నా సమయమింక రాలేదనెను. 5 ఆయన తల్లిపరిచారకులను చూచి - ఆయన మీతో చెప్పునది చేయుడనెను. 6 యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరురాతిబానలు అక్కడ ఉంచబడియుండెను. 7 యేసు - ఆ బానలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులమట్టుకు నింపిరి. 8 అప్పుడాయన వారితో - మీరిప్పుడు ముంచి, విందు ప్రధానియొద్దకు తీసికొనిపొండని చెప్పగా వారు తీసికొనిపొయిరి. 9 ఆ ద్రాక్షారసము ఎక్కడనుండి వచ్చెనో ఆ నీళ్లుముంచి తీసికొనిపోయిన పరిచారకులకే తెలిసినదిగాని విందు ప్రధానికి తెలియకపోయెను గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లికుమారుని పిలిచి 10 - ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి, జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసమును పోయును; నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసమును ఉంచుకొని యున్నావని అతనితో చెప్పెను. 11 గలిలైయలోని కానాలో యేసు ఈ మొదటి సూచకక్రియనుచేసి తన మహిమను బయలుపరిచెను; అందువలన ఆయన శిష్యులు ఆయనయందు విశ్వాసముంచిరి. 12 అటుతరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన సహోదరులును ఆయన శిష్యులును కపెర్నహూముకు వెళ్లి అక్కడ కొన్ని దినములుండిరి. 13 యూదుల పస్కాపండుగ సమీపింపగా యేసు యెరూషలేముకు వెళ్లి 14 దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును కూర్చుండుట చూచి 15 త్రాళ్లతో కొరడాలు చేసి, గొర్రెలను ఎడ్లనన్నిటిని దేవాలయములోనుండి తోలివేసి, రూకలు మార్చువారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి 16 పావురములు అమ్మువారితో -వీటిని ఇక్కడనుండి తీసికొనిపొండి; నా తండ్రి యిల్లు వ్యాపారపుటిల్లుగా చేయకుడని చెప్పెను. 17 ఆయన శిష్యులు -నీ యింటినిగూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని3 వ్రాయబడియున్నట్టు జ్ఞాపకము చేసికొనిరి. 18 కాబట్టి యూదులు - నీవీ కార్యములు చేయుచున్నావే; యే సూచకక్రియను మాకు చూపెదవని ఆయనను అడుగగా 19 యేసు - ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను. 20 యూదులు - ఈ దేవాలయము నలువదియారు సంవత్సరముములు కట్టిరే, నీవు మూడు దినములలో దాని లేపుదువా అనిరి. 21 అయితే ఆయన తన శరీరమను దేవాలయముగూర్చి యీ మాట చెప్పెను. 22 ఆయన మృతులలోనుండి లేచిన తరువాత ఆయన ఈ మాట చెప్పెనని ఆయన శిష్యులు జ్ఞాపకము చేసికొని, లేఖనమును యేసు చెప్పెన మాటను నమ్మిరి. 23 ఆయన పస్కా (పండుగ) సమయమున యెరూషలేములో ఉండగా, ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచకక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసముంచిరి. 24 అయితే యేసు అందరిని ఎరిగనవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసికొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు 25 గనుక ఎవడును మనుష్యునిగూర్చి ఆయనకు సాక్ష్యమియ్య నక్కరలేదు. Download Audio File
1 యూదుల అధికారియైన నికొదేమను పరిసయ్యుడొకడుండెను. 2 అతడు రాత్రియందు ఆయనయొద్దకు వచ్చి - బోధకుడా, నీవు దేవునియొద్దనుండి వచ్చిన బోధకుడవని మేమెరుగుదుము; దేవుడతనికి తోడైయుంటేనే కాని నీవు చేయుచున్న సూచకక్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పెను. 3 అందుకు యేసు అతనితో - ఒకడు క్రొత్తగాజన్మించితేనే కాని అతడు దేవునిరాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 4 అందుకు నికొదేము - ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా 5 యేసు ఇట్లనెను - ఒకడు నీటిమూలముగాను ఆత్మమూలముగాను జన్మింతేనే కాని దేవునిరాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 6 శరీరమూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునై యున్నది. 7 మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. 8 గాలి తన కిష్టమైన చోటను విసురును; నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మంచిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను. 9 అందుకు నికొదేము - ఈ సంగతులేలాగు సాధ్యములని ఆయనను అడుగగా 10 యేసు ఇట్లనెను - నీవు ఇశ్రాయేలుకు బోధకుడవైయుండి వీటిని ఎరుగవా? 11 మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము, మా సాక్ష్యము మీంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 12 భూసంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు, పరలోకసంబంధమైనవి మీతో చెప్పినయెడల ఏలాగు నమ్ముదురు? 13 మరియు పరలోకమునుండి దిగివచ్చినవాడే, అనగా పరలోకములో ఉండుమనుష్యకుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయినవాడెవడును లేడు. 14-15. అరణ్యములో మోషే సర్పమును ఏలాగు ఎత్తెనో ఆలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవముపొందునట్లు మనుష్యకుమారుడు ఎత్తబడవలెను. 16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. 17 లోకము తన కూమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడాయనను లోకములోకి పంపలేదు. 18 ఆయనయందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు; విశ్వసింపనివాడు దేవుని అద్వితీయకుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. 19 ఆ తీర్పు ఇదే; వెలుగు లోకములోకివచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. 20 దుష్కార్యముచేయుప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్ క్రియలుగా కనబడకుండునట్లువెలుగునొద్దకు రాడు. 21 సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడియున్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వచ్చుననెను. 22 అటుతరువాత యేసు తన శిష్యులతోకూడ యూదైయదేశమునకు వచ్చి, అక్కడ వారితో కాలముగడుపుచు బాప్తిస్మమిచ్చుచుండెను, 23 సలీము దగ్గెరనున్న ఐనోనను స్ధలమున నీళ్లు విస్తారముగా ఉండెను కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మమిచ్చుచుండెను; జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. 24 యోహాను ఇంక చెరసాలలో వేయబడియుండలేదు. 25 శుద్ధీకరణాచారమునుగూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను 26 గనుక వారు యోహాను నొద్దకు వచ్చి - బోధకుడా, యెవడు యొర్దానుకు అవతల నీతోకూడ ఉండెనో, నీవెవనిగూర్చి సాక్ష్యమిచ్చితివో, యిదిగో ఆయన బాప్తిస్మమిచ్చుచున్నాడు; అందరు ఆయనయొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. 27 అందుకు యోహాను ఇట్లనెను - తనకు పరలోకమునుండి అనుగ్రహింపబడితేనేగాని యెవడును ఏమియు పొందనేరడు. 28 నేను క్రీస్తును కాననియు, అయనకంటె ముందుగా పంపబడినవాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. 29 పెండ్లికుమార్తెగలవాడు పెండ్లికుమారుడు; అయితే నిలువబడి పెండ్లికుమారుని స్వరము వినెడి స్నేహితుడు ఆ పెండ్లికుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును; ఈ నా సంతోషము పరిపూర్ణమైయున్నది. 30 ఆయన హెచ్చవలసియున్నది నేను తగ్గవలసియున్నది. 31 పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు; భూమినుండి వచ్చువాడు భూసంబంధమైన సంగతులనుగూర్చి మాటలాడును; పరలోకమునుండి వచ్చువాడు అందరికి పైగానుండి 32 తాను కన్నవాటినిగూర్చియు విన్నవాటినిగూర్చియు సాక్ష్యమిచ్చును; ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. 33-34. ఆయన సాక్ష్యము అంగీకరించినవాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్రవేసియున్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపినవానికి కొలతలేకుండ ఆత్మననుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలేపలుకును. 35 తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయనచేతికి సమస్తము అప్పగించి యున్నాడు. 36 కుమారునియందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు; కుమారునికి విధేయుడు కానివాడు జీవముచూడడు గాని దేవుని యుగ్రత వాని మీద నిలిచియుండును. Download Audio File
1 యోహానుకంటె యేసు ఎక్కువమందిని శిష్యులనుగా చేసికొని వారికి బాప్తిస్మమిచ్చుచున్న సంగతి పరిసయ్యులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు. 2 ఆయన యూదైయదేశమును విడిచి గలిలైయదేశమునకు తిరిగి వెళ్లెను. 3 అయినను యేసే బాప్తిస్మమియ్యలేదుగాని ఆయన శిష్యులిచ్చుచుండిరి. 4 ఆయన సమరైయ మార్గమున వెళ్లవలసివచ్చెను గనుక 5 యాకోబు తన కూమారుడైన యోసేపుకిచ్చిన భూమి దగ్గెరనున్న సమరైయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. 6 అక్కడ యాకోబు బావి యుండెను గనుక యేసు ప్రయాసమువలన అలసియున్నరీతినే ఆ బావియొద్ద కూర్చుండెను; అప్పటికి ఇంచుమించు ఆరుగంటలాయెను. 7 సమరైయ స్త్రీ యెకతె నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు - నాకు దాహమునకిమ్మని ఆమెనడిగెను. 8 ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోకి వెళ్లియుండిరి. 9 ఆ సమరైయ స్త్రీ - యూదుడవైన నీవు సమరైయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని యేలాగు అడుగుచున్నావని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరైయులతో సాంగత్యము చేయరు. 10 అందుకు యేసు -నీవు దేవుని వరమును - నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగచున్నవాడెవడో అదియు ఎరిగియుంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పెను. 11 అప్పుడా స్త్రీ - అయ్యా, యీ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమియు లేదే; ఆ జీవజలము ఏలాగు నీకుదొరుకును? 12 తన కుమాళ్లతోను పశ్వాదులతోను తానుకూడ దీని నీళ్లు త్రాగి యీ బావి మాకిచ్చిన మన తండ్రియైన యాకోబుకంటె నీవు గొప్పవాడవా అని ఆయనను అడిగెను. 13 అందుకు యేసు - ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరల దప్పిగొనును; 14 నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవము కలుగుటకై వానిలో ఊరెడి నీటిబుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. 15 ఆ స్త్రీ ఆయనను చూచి - అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును, చేదుకొనుటకింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయుమని అడుగగా 16 యేసు - నీవు వెళ్లి నీ పెనిమిటిని పిలుచుకొని యిక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. 17 ఆ స్త్రీ - నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో - నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే; 18 నీకు అయిదుగురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు నీకున్నవాడు నీ పెనిమిటి కాడు; సత్యమే చెప్పితివనెను. 19 అప్పుడా స్త్రీ - అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. 20 మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్ధలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను 21 - అమ్మా, ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమందు ఈ పర్వతములోనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; 22 మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. 23 అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్నుఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. 1 24 దేవుడు ఆత్మగనుక ఆయనను ఆలాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. 25 ఆ స్త్రీ ఆయనతో - క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా 26 యేసు - నీతో మాటలాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. 27 ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాటలాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని - నీకేమి కావలెననియైనను, ఈమెతో ఎందుకు మాటలాడుచున్నావనియైనను ఎవడును అడుగలేదు. 28 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్లి 29 - మీరు వచ్చి, నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యునిచూడుడి; ఈయన క్రీస్తుకాడా అని ఆ ఊరివారితో చెప్పగా 30 వారు ఊరిలోనుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చిరి. 31 ఆలోగా శిష్యులు - బోధకుడా, భోజనము చేయుమని ఆయనను వేడుకొనిరి. 32 అందుకాయన - భుజించుటకు మీకు తెలియని ఆహారమునాకు ఉన్నదని వారితో చెప్పగా 33 శిష్యులు - ఆయన భుజించుటకు ఎవడైన నేమైనను తెచ్చెనేమో అని యొకనితో ఒకడు చెప్పుకొనిరి. 34 యేసు వారిని చూచి - నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమైయున్నది. 35 ఇంక నాలుగు నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు గదా. యిదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవని మీతో చెప్పుచున్నాను. 36 విత్తువాడును కోయువాడునుకూడ సంతోషించునట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్యజీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. 37 విత్తువాడొకడు కోయువాడొకడను మాట యీ విషయములో సత్యమే. 38 మీరు దేనిగూర్చి కష్టపడలేదో దాని కోయుటకు మిమ్మును పంపితిని; ఇతరులు కష్టపడిరి మీరు వారి కష్టములో ప్రవేశించియున్నారని చెప్పెను. 39 - నేను చేసినవన్నియు నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ యొక్క మాటనుబట్టి ఆ ఊరిలోని సమరైయులలో అనేకులు ఆయనయందు విశ్వాసముంచిరి 40 ఆ సమరైయులు ఆయనయొద్దకు వచ్చి, తమయొద్ద ఉండుమని ఆయనను వేడుకొనిరి గనుక ఆయన అక్కడ రెండు దినములుండెను. 41 ఆయన మాటలు వినినందున ఇంక అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి - ఇక మీదట నీవు చెప్పిన మాటనుబట్టి నమ్మము; 42 మామట్టుకు మేము విని, యీయన నిజముగా లోకరక్షకుడని తెలిసికొన్నామనిరి. 43 ఆ రెండు దినములైన తరువాత ఆయన అక్కడనుండి బయలుదేరి గలిలైయకు వెళ్లెను. 44 ఎందుకనగా ప్రవక్త స్వదేశములో ఘనత పొందడని యేసు సాక్ష్యమిచ్చెను. 45 గలిలైయులుకూడ ఆ పండుగకు వెళ్లువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నియు వారు చూచినందున ఆయన గలిలైయకు వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. 46 తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలైయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగియై యుండెను. 47 యేసు యూదైయనుండి గలిలైయకు వచ్చెనని అతడు విని ఆయనయొద్దకు వెళ్లి, తన కుమారుడు చావ సిద్ధమైయుండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనెను. 48 యేసు -సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంతమాత్రమును నమ్మరని అతనితో చెప్పెను. 49 అందుకా ప్రధాని - ప్రభువా, నా కుమారుడు చావకమునుపే రమ్మని ఆయనను వేడుకొనెను. 50 యేసు - నీవు వెళ్లుము. నీ కుమారుడు బ్రదికియున్నాడని అతనితో చెప్పగా ఆ మనుష్యుడు యేసు తనతో చెప్పినమాట నమ్మి వెళ్లిపోయెను. 51 అతడింక వెళ్లుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగావచ్చి అతని కుమారుడు బ్రదికియున్నాడని తెలియజెప్పిరి. 52 ఏ గంటకు వాడు బాగుపడసాగెనని వారిని అడిగినప్పుడు వారు - నిన్న ఒంటిగంటకు జ్వరము వాని విడిచెనని అతనితో చెప్పిరి. 53 -నీ కుమారుడు బ్రదికియున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలిసికొనెను గనుక అతడును అతని యింటివారందరును నమ్మిరి. 54 యేసు యూదైయనుండి గలిలైయకు వచ్చి చేసిన సూచకక్రియలలో ఇది రెండవది. Download Audio File
1 అటుతరువాత యూదుల పండుగ యెకటివచ్చెను గనుక యేసు యెరూషలేముకు వెళ్లెను. 2 యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గెర, హెబ్రీభాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరుండెను, దానికి అయిదు మంటపములు కలవు. 3-4. ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగుపడును, గనుక ఆ మంటపములలో వ్యాధిగ్రస్తులు, గుడ్డివారు, కుంటివారు, ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి. 5 అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను. 6 యేసు వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి - స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా 7 ఆ వ్యాధిగ్రస్తుడు - అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. 8 యేసు - నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా 9 వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను. 10 ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు - ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొనతగదే అని స్వత్థత నొందినవానితో చెప్పిరి. 11 అందుకు వాడు - నన్ను స్వస్థపరచినవాడు - నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను. 12 వారు - నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి. 13 ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపుకూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను. 14 అటుతరువాత యేసు దేవాలయములో వాని చూచి - ఇదిగో నీవు స్వస్థతనొందితివి; మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా 15 వాడు వెళ్లి తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను. 16 ఈ కార్యములను విశ్రాంతిదినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. 17 అయితే యేసు -నా తండ్రి యిదివరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. 18 ఆయన విశ్రాంతి దినాచారమును మీరుట మాత్రమే గాక, దేవుడు తన స్వంత తండ్రి అని చెప్పి, తన్నుదేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. 19 కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను -తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో అదేకాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును ఆలాగే చేయును. 20 తండ్రి కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటినెల్లను ఆయనకు అగుపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడునట్లు ఘనమైన కార్యములను ఆయనకు అగుపరచును. 21 తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును. 22 తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని 23 తండ్రిని ఘనపరుచునట్లుగా అందరును కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి యున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు. 24 నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసమంచువాడు నిత్యజీవము గలవాడైయున్నాడు; వాడు తీర్పులోకి రాక మరణములోనుండి జీవములోకి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాచు. 25 మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది; దాని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 26 తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. 27 మరియు ఆయన మనుష్యకుమారుడు గనుక తీర్పు తీర్చుటకును (తండ్రి) ఆయనకు అధికారము అనుగ్రహించెను. 28 దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని 29 మేలుచేసినవారు జీవపునరుత్థానమునకును కీడుచేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. 30 నాయంతట నేనే ఏమియు చేయలేను;నేను వినునట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపినవాని చిత్తప్రకారమే చేయ గోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది. 31 నన్నుగూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనిన పక్షమున నా సాక్ష్యము సత్యము కాదు. 32 నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును. 33 మీరు యోహానునొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. 34 నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరంపను గాని మీరు రక్షింపబడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను. 35 అతడు ప్రజ్వలించుచు ప్రకాశించుచున్న దీపమై యుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. 36 అయితే యోహాను సాక్ష్యముకంటె నాకెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెరవేర్చుటకై తండ్రి యే క్రియలను నాకిచ్చియున్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 37 మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన శబ్దము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు. 38 ఆయన ఎవని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు. 39 లేఖనములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు; అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. 40 అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు. 41 నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను. 42 నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు. 43 నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను; మీరు నన్ను అంగీకరింపరు; మరియొకడు తన నామమున వచ్చిన పక్షమున వానిని అంగీకరింతురు. 44 అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పును కోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి; 45 మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపువాడు. 46 అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్లయిన నన్నును నమ్ముదురు. 47 మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను. Download Audio File
1 అటుతరువాత యేసు తిబెరియ సముద్రము, అనగా గలిలైయ దాటి అద్దరికి వెళ్లెను. 2 రోగులయెడల ఆయన చేసిన సూచకక్రియలను చూచి బహు జనులు ఆయనను వెంబడించిరి 3 యేసు కొండెక్కి అక్కడ తన శిష్యులతోకూడ కూర్చుండెను 4 అప్పుడు పస్కా అను యూదుల పండుగ సమీపించెను. 5 కాబట్టి యేసు కన్నులెత్తి బహు జనులు తనయొద్దకు వచ్చుట చూచి - వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని ఫిలిప్పు నడిగెను గాని 6 యేమి చేయనై యుండెనో తానే యెరిగియుండి అతని శోధించుటకు ఆలాగడిగెను. 7 అందుకు ఫిలిప్పు - వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనుటకైనను ఇన్నూరు దేనారములరొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను 8 ఆయన శిష్యులలో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ 9 - ఇక్కడ ఉన్న యొక చిన్నవానియొద్ద అయిదు యవల రొట్టెలును రెండు చిన్న చేపలును ఉన్నవిగాని, యింతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా 10 యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాలా పచ్చిక యుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదు వేల పురుషులు కూర్చుండిరి. 11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్నవారికి వడ్డించెను; ఆలాగున చేపలుకూడ వారికిష్టమైనంత మట్టుకు వడ్డించెను. 12 వారు తృప్తిగా తినిన తరువాత ఏమియు నష్టపడకుండ మిగిలిన ముక్కలు పోగుచేయుడని తన శిష్యులతో చెప్పెను. 13 కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలిన అయిదు యవల రొట్టెల ముక్కలు పోగుచేసి పన్నెండు గంపెళ్లు నింపిరి. 14 ఆ మనుష్యులు యేసు చేసిన సూచకక్రియను చూచి - నిజముగా ఈ లోకమునుక రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. 15 రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి, మరల కొండకు ఒంటరిగా వెళ్లెను. 16 సాయంకాలమైనప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్లి దోనె ఎక్కి సముద్రపు అద్దరికి కపెర్నహూముకు పోవుచుండిరి. 17 అంతలో చీకటాయెను గాని యేసు వారియొద్దకు ఇంక రాలేదు. 18 అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. 19 వారు ఇంచుమించు రెండు కోసుల దూరము దోనెను నడిపించిన తరువాత, యేసు సముద్రముమీద నడుచుచు తమ దోనెదగ్గెరకు వచ్చుట చూచి భయపడిరి; 20 అయితే ఆయన - నేనే, భయపడకుడని వారితో చెప్పెను. 21 అంతట ఆయనను దోనెమీద ఎక్కించుకొనుటకు వారికిష్టమాయెను. వెంటనే ఆ దోనె వారు వెళ్లుచున్న దేశమునకు చేరెను. 22 మరునాడు సముద్రపు అద్దరిని నిలిచియున్న జనసమూహము వచ్చి చూడగా, ఒక చిన్నదోనె తప్ప అక్కడ మరియొకటి లేదనియు, యేసు తన శిష్యులుమాత్రమే వెళ్లిరనియు తెసికొనిరి. 23 అయితే ప్రభువు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పురడు వారు రొట్టె భుజించిన చోటుకు దగ్గెరనున్న తిబెరియనుండి వేరే చిన్న దోనెలు వచ్చెను. 24 కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట జనసమూహము చూచినప్పుడు వారా చిన్న దోనెలెక్కి యేసును వెదకుచు కపెర్నహూముకు వచ్చిరి. 25 సముద్రపు అద్దిరిని ఆయనను కనుగొని - బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా 26 యేసు - మీరు సూచకక్రియలను చూచుటవలన కాదు, రొట్టెలు భుజించి తృప్తిపొందుటవలననే నన్ను వెదుకుచున్నారని మీతో నీశ్చయముగా చెప్పుచున్నాను. 27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి; మనుష్యకుమారుడు దాని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను. 28 వారు - మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా 29 యేసు - ఆయన పంపినవానియందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియయని వారితో చెప్పెను. 30 వారు - అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచకక్రియ చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? 31 భుజించుటకు పరలోకమునుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అనివ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. 32 కాబట్టి యేసు - పరలోకమునుండి వచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు, నా తండ్రియే పరలోకమునుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. 33 పరలోకమునుండి దిగి వచ్చి, లోకమునకు జీవము నిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమై యున్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. 34 కావున వారు - ప్రభువా, యీ ఆహారము ఎల్లప్పుడు మాకు అనుగ్రహించుమనిరి. 35 అందుకు యేసు వారితో ఇట్లనెను - జీవాహారము నేనే; నాయందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. 36 మీరు నన్ను చూచియుండియు విశ్వసింపక యున్నారని మీతో చెప్పితిని. 37 తండ్రి నాకు అనుగ్రహించువారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువాని నేనెంతమాత్రమును బయటికి తోసివేయను. 38 నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని. 39 ఆయన నాకు అనుగ్రహించిన యావత్తులో నేనేమియు పోగొట్టకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపినవాని చిత్తమై యున్నది. 40 కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము; అంత్యదినమున నేను వాని లేపుదును. 41 నేను పరలోకమునుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయననుగూర్చి సణుగుకొనుచు - 42 ఈయన తలిదండ్రులను మన మెరుగుదుము గదా? - నేను పరలోకమునుండి దిగి వచ్చియున్నానని ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి. 43 అందుకు యేసు - మీలో మీరు సణుగుకొనకుడి; 44 నన్ను పంపిన తండ్రి ఆకర్షించితేనే గాని యెవడును నాయొద్దకు రాలేడు; అంత్యదినము నేను వాని లేపుదును. 45 - వారందరును దేవునిచేత బోధింపబడుదురు అని ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది గనుక తండ్రివలన విని నేర్చుకొనిన ప్రతివాడును నాయొద్దకు వచ్చును. 46 దేవుని యొద్దనుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రని చూచియుండలేదు; ఈయనే తండ్రిని చూచియున్నవాడు. 47-48. విశ్వసించువాడే నిత్యజీవము గలవాడు. జీవాహారము నేనే 49 మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. 50 ప్రతివాడును తిని చావకుండునట్లు పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమిదే. 51 పరలోకమునుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడును జీవించును; మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవముకొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను. 52 యూదులు - ఈయన తన శరీరమును ఏలాగు తిననియ్యగలడని యొకనితో ఒకడు వాదించిరి. 53 కావున యేసు ఇట్లనెను - మీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. 54 నా శరీరము తిని నా రక్తము త్రాగు వాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వాని లేపుదును. 55 నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. 56 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. 57 జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రిమూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. 58 ఇదే పరలోకమునుండి దిగివచ్చిన ఆహారము; పితరులు (మన్నాను ) తినియు చనిపోయినట్టుకాదు; ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడును జీవించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. 59 ఆయన కపెర్నహూములో బోధించుచు సమాజమందిరములో ఈ మాటలు చెప్పెను. 60 ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని - యిది కఠినమైన మాట, యిది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. 61 యేసు తన శిష్యులు దీనిగూర్చి సణుగుకొనుచున్నారని తనకుతానే యెరిగి వారితో ఇట్లనెను - దీనివలన మీరు అభ్యంతరపడుచున్నారా? 62 అలాగైతే మీరు మనుష్యకుమారుడు మునుపున్నచోటుకు ఎక్కుట చూచినయెడల ఏమందురు? 63 ఆత్మయే జీవింపచేయుచున్నది; శరీరము కేవలము నిష్ ప్రయోజనము. నేను మీతో చెప్పియున్నమాటలు ఆత్మయు జీవమునైయున్నవి గాని 64 మీలో విశ్వసించనివారు కొందరున్నారని వారితో చెప్పెను. విశ్వసించనివారెవరో, తన్ను అప్పగింపబోవువాడెవడో, మొదటినుండి యేసుకు తెలియును. 65 మరియు ఆయన - తండ్రిచేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడును నాయొద్దకు రాలేడని యీ హేతువునుబట్టి మీతో చెప్పితిననెను. 66 అప్పటినుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుకతీసి మరి ఎన్నడును ఆయనను వెంబడింపలేదు. 67 కాబట్టి యేసు - మీరు కూడ వెళ్లిపోవలెనని యున్నారా అని పన్నెండుమందిని అడుగగా 68 సీమోను పేతురు - ప్రభువా, యెవనియొద్దకు వెళ్లుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు; 69 నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి యెరిగియున్నామని ఆయనతో చెప్పెను. 70 అందుకు యేసు - నేను పన్నెండుగురైన మిమ్మును ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు అపవాది అని వారితో చెప్పెను. 71 సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదా పన్నెండుమందిలో ఒకడైయుండి ఆయననప్పగింపబోవుచుండెను గనుక వానిగూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. Download Audio File
1 అటుతరువాత యూదులు ఆయనను చంపయత్నించినందున యేసు యూదైయలో సంచరించనొల్లక గలిలైయలో సంచరించుచుండెను. 2 యూదుల పండుగైన పర్ణశాలలపండుగ సమీపించెను గనుక 3 ఆయన సహోదరులు ఆయనను చూచి - నీవు చేయుచున్న క్రియలు నీ శిష్యులును చూచునట్లు ఈ స్థలము విడిచి యూదైయకు వెళ్లుము. 4 బహిరంగమున అంగీకరింపబడ గోరువాడెవడును తన పని రహస్యమునజరిగింపడు. నీవు ఈ కార్యములు చేయుచున్నయెడల నిన్ను నీవే లోకమునకు కనపరచుకొనుమని చెప్పిరి. 5 ఆయన సహోదరులైనను ఆయనయందు విశ్వాసముంచలేదు. 6 యేసు - నా సమయమింకను రాలేదు; మీ సమయమెల్లప్పుడును సిద్ధముగానే యున్నది. 7 లోకము మిమ్మును ద్వేషింపనేరదు గాని, దాని క్రియలు చెడ్డవని నేను దానిగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను గనుక అది నన్ను ద్వేషించుచున్నది. 8 మీరు పండుగకు వెళ్లుడి; నా సమయమింకను పరిపూర్ణము కాలేదుగనుక నేను ఈ పండుగకు ఇంకను వెళ్లనని వారితో చెప్పెను. 9 ఆయన వారితో ఈలాగున చెప్పి గలిలైయలో నిలిచిపోయెను. 10 అయితే ఆయన సహోదరులు పండుగకు వెళ్లిపోయిన తరువాత ఆయనకూడ బహిరంగముగా వెళ్లక రహస్యముగా వెళ్లెను. 11-12. పండుగలో యూదులు - ఆయన ఎక్కడనని ఆయననుగూర్చి గొప్ప సణుగుపుట్టెను; కొందరాయన మంచివాడనిరి; మరికొందరు - కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడనిరి; 13 అయితే యూదులకు భయపడి ఆయననుగూర్చి యెవడును బహిరంగముగా మాటలాడలేదు. 14 సగము పండుగైనప్పుడు యేసు దేవాలయములోకి వెళ్లి భోధించుచుండెను. 15 యూదులు అందుకు ఆశ్చర్యపడి - చదువుకొనని ఇతనికి ఈ పాండిత్యమెట్లు వచ్చెనని చెప్పుకొనిరి. 16 అందుకు యేసు - నేను చేయుబోధ నాది కాదు నన్ను పంపినవానిదే. 17 ఎవడైన ఆయన చిత్తముచొప్పున చేయగోరినయెడల, ఆ బోధ దేవునివలన కలిగినదో లేక నా యంతట నేనే బోధించుచున్నానో వాడు తెలిసికొనును. 18 తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దర్ణీతియు లేదు. 19 మోషే మీకు ధర్మశాస్త్రము ఇయ్యలేదా? అయినను మీలో ఎవడును ఆ ధర్మశాస్త్రమును గైకొనడు; మీరెందుకు నన్ను చంప జూచుచున్నారని వారితో చెప్పెను. 20 అందుకు జనసమూహము - నీవు దయ్యము పట్టినవాడవు, ఎవడు నిన్ను చంప జూచుచున్నాడని అడుగగా 21 యేసు వారిని చూచి -నేను ఒక కార్యముచేసితిని; అందుకు మీరందరు ఆశ్చర్యపడుచున్నారు. 22 మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను, ఈ సంస్కారము మోషేవలన కలిగినది కాదు, పితరులవలననే కలిగినది. అయినను విశ్రాంతిదినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. 23 మోషే ధర్మశాస్త్రము మీరకుండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతిదినమున సున్నతిపొందును గదా. ఇట్లుండగా నేను విశ్రాంతిదినమున ఒక మనుష్యుని పూర్ణస్వస్థతగలవానిగా చేసినందుకు మీరు నామీద ఆగ్రహపడుచున్నారేమి? 24 వెలిచూపునుబట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. 25 యెరూషలేమువారిలో కొందరు - వారు చంపయత్నించువాడు ఈయనే కాడా; 26 ఇదిగో ఈయన బహిరంగముగా మాటలాడుచున్నను ఈయనను ఏమనరు; ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలిసికొనియుందురా? 27 అయినను ఈయన ఎక్కడివాడో యెరుగుదుము; క్రీస్తు వచ్చునప్పుడు ఆయన ఎక్కడివాడో యెవడును ఎరుగడని చెప్పుచుండిరి. 28 కాగా యేసు దేవాలయములో బోధించుచు -మీరునన్నెరుగుదురు; నేనెక్కడివాడనో యెరుగుదురు; నాయంతట నేనే రాలేదు, నన్ను పంపినవాడు సత్యవంతుడు, ఆయనను మీరెరుగరు. 29 నేను ఆయనయొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనయొద్దనుండి వచ్చితిని; ఆయన నన్ను పంపెను. 30 అందుకు వారాయనను పట్టుకొన యత్నముచేసిరి గాని ఆయన గడియ యింక రాలేదు గనుక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. 31 మరియు జనసమూహములో అనేకులు ఆయనయందు విశ్వాసముంచి - క్రీస్తు వచ్చునప్పుడు ఈయన చేసినవాటికంటె ఎక్కువైన సూచక క్రియలు చేయునా అని చెప్పుకొనిరి. 32 జనసమూహము ఆయననుగూర్చి యీలాగు సణుగుకొనుట పరసయ్యులు వినినప్పుడు, ప్రధానయాజకులును పరిసయ్యలును ఆయనను పట్టుకొనుటకు బంట్రౌతులను పంపిరి. 33 యేసు -ఇంక కొంతకాలము నేను మీతోకూడ నుందును : తరువాత నన్ను పంపినవానియొద్దకు వెళ్లుదును; 34 మీరు నన్ను వెదుకుదురు గాని నన్నుకనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరురాలేరనెను. 35 అందుకు యూదులు - మనము ఈయనను కనుగొనకుండునట్లు ఈయన ఎక్కడికి వెళ్లబోవుచున్నాడు? హెల్లేనీయులలో చెదరిపోయిన వారియొద్దకు వెళ్లి హెల్లేనీయులకు బోధింప బోవుచున్నాడా? 36 - నన్ను వెదుకుదురు గాని కనుగొనరు, నేనెక్కడ ఉందునో అక్కడికి మీరు రాలేరని ఆయన చెప్పిన యీ మాట ఏమిటో అని తమలోతాము చెప్పుకొనుచుండిరి. 37 ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి - ఎవడైన దప్పిగొనిన యెడల నాయెద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. 38 నాయందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టువాని కడుపులోనుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పెను. 39 తనయందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంక మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడియుండలేదు. 40 జనసమూహములో కొందరు ఈ మాటలు విని - నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి; 41 మరికొందరు - ఈయన క్రీస్తే అనిరి; మరికొందరు - ఏమి? క్రీస్తు గలిలైయలోనుండి వచ్చునా? 42 క్రీస్తు దావీదు సంతానములోపుట్టి దావీదు ఉండిన బేత్లెహేమను గ్రామములోనుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా అనిరి. 43 కాబట్టి ఆయననుగూర్చి జనసమూహములో భేదము పుట్టెను. 44 వారిలో కొందరు ఆయనను పట్టుకొన దలచిరి గాని యెవడును ఆయనను పట్టుకొనలేదు. 45 ఆ బంట్రౌతులు ప్రధానయాజకులయొద్దకును పరిసయ్యులయొద్దకును వచ్చినప్పుడు వారు - ఎందుకు మీరాయనను తీసికొని రాలేదని అడుగగా 46 ఆ బంట్రౌతులు - ఆ మనుష్యుడు మాటలాడినట్లు ఎవడును ఎన్నడును మాటలాడలేదనిరి. 47 అందుకు పరిసయ్యులు - మీరుకూడ మోసపోతిరా? 48 అధికారులలోగాని పరసయ్యులలోగాని యెవడైనను ఆయనయందు విశ్వాసముంచెనా? 49 అయితే ధర్మశాస్త్రమెరుగని యీ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. 50 ఆయనయొద్దకు వచ్చిన నికొదేము వారిలో ఒకడైయుండెను. 51 అతడు - ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనకమునుపును, మన ధర్మశాస్త్రము వానికి తీర్పు తీర్చునా అని అడుగగా 52-53. వారు - నీవును గలిలైయుడవా? విచారించి చూడుము, గలిలైయులో ఏ ప్రవక్తయు పుట్టడనిరి. అంతట ఎవరి యింటికి వారు వెళ్లిరి